అమరావతి- ఏపీ సీఎం వైఎస్ జగన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో కరోనా నేపధ్యంలో అటో డ్రైవర్లు, ప్రైవేటు టీచర్లు, రిక్షా పుల్లర్లు, హమాలీలు పనిలేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పరిమర్శించే ఓపిక లేదని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. మంగళగిరిలో సాధన దీక్ష చేపట్టిన చంద్రబాబు.. తమిళనాడులో అమ్మ క్యాంటిన్ల విషయంలో సీఎం స్టాలిన్ వ్యవహారించిన తీరును ప్రశంసించారు.
అమ్మ క్యాంటిన్ల విషయంలో వివాదం చెలరేగితే, ఇది మంచి పర్పస్ కోసం పెట్టారని, దీన్ని తీసెయ్యడం కరెక్ట్ కాదని స్టాలిన్ ఒక్క మాటతో తేల్చి చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే అమ్మ క్యాంటిన్లపై దాడి చేసిన వాళ్ల సొంత కార్యకర్తలపై చర్యలు తీసుకున్నారని స్టాలిన్ ను అభినందించారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లను దివంగత సీఎం జయలలిత ఫొటో పెట్టి కొనసాగిస్తున్నారంటే, అదీ సరైన రాజకీయ సంస్కృతి అని చంద్రబాబు స్టాలిన్ ను పొగడ్తలలో ముంచెత్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి సీఎం జగన్ నేర్చుకోవాల్సి ఉందని ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.
ఆంద్రప్రదేశ్ లోను పేదవాడికి పూటకు 5 రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు ఏం తప్పు చేశాయని మూసివేశారని ఆయన నిలదీశారు. పేద ప్రజలు సంపాదించే సగం డబ్బులు మధ్యాహ్న భోజనానికి అయిపోతున్నాయన్న కోణంలో ఆలోచించి, 5 రూపాయిలకే అన్న క్యాంటిన్ల ద్వారా భోజనం అందించినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేవలం 15 రూపాయలకే పేదవాళ్లకు మూడు పూటలా కడుపు నిండా తిండి పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగు దేశం సర్కారే అని చంద్రబాబు మరోసారి చెప్పారు. పేదవాడిపై సీఎం జగన్కు ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ఆవేధన వ్యక్తం చేశారు.