హైదరాబాద్ క్రైం- హైదరాబాద్ మాదాపూర్ లో ఓ మహిళపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే, మరో ఘోరం జరిగింది. నగరంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది.
శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందిన వెంకటాచారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కార్పెంటర్గా పనిచేసేవాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా సోకడంతో ఏడాదిన్నర క్రితం మరణించాడు. పెద్ద కుమార్తెకు పెళ్లికావడంతో మొయినాబాద్ లో ఉంటోంది. చిన్న కుమార్తె సౌజన్య బాచుపల్లి డీఆర్కే కాలేజ్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
పెద్ద కూతురు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఈ నెల 18న తల్లి మొయినాబాద్కు వెళ్లడంతో సౌజన్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అతడు.. సౌజన్య పిచ్చిపిచ్చిగా అరుస్తోంది.. డాక్టర్ని తీసుకొస్తా.. అని ఇంటిపైన అద్దెకున్న వారితో చెప్పి వెళ్లిపోయాడు. వారు వెళ్లి చూడగా సౌజన్య కింద పడి ఉంది.
వెంటనే వాళ్లు డాక్టర్ని తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. సౌజన్య తల్లి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌజన్య ఒంటరిగా ఉన్నసమయంలో వచ్చింది విజయ్ అని సీసీ కెమెరా పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. అతడు స్థానికంగా జీటీజీ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. 8నెలల క్రితం సౌజన్య అక్కడ ఉద్యోగం చేసింది.
కాలేజీకి వెళ్లాలని ఉద్యోగం మానేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సౌజన్యను ప్రేమ పేరుతో విజయ్ వేధించేవాడని తల్లి చెబుతోంది. ఘటన జరిగాక కూడా విజయ్ స్థానికంగానే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. విజయ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.