కాలజ్ఞానం చెప్పి మానవాళికి మార్గ, నిర్దేశం చేసిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్రస్వామి. ఇందుకే బ్రహ్మం గారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు ప్రజలు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఇప్పటి వరకు అక్షరం కూడా పొల్లు పోకుండా జరుగుతూనే వస్తోంది. ప్రపంచ దేశాలు సైతం ఈ విషయంలో ఆశ్చర్యపోతూనే ఉన్నాయి. కొన్ని శతాబ్దాల ముందే బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎలా చెప్పగలిగారు అన్నది ఈనాటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటూ మఠంలో కార్యక్రమలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి నిన్న మొన్నటి వరకు మఠానికి పీఠాధిపతిగా ఉంటూ వచ్చారు. కాగా.., ఇటీవల ఆయన మరణించారు. దీనితో తరువాతి పీఠాధిపతి ఎవరన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది.వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో మొదటి భార్య చంద్రావతమ్మకి 8 మంది సంతానం. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు.
అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇలా ఇద్దరి పేర్లు రాయడంతో సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి పీఠాధిపతిగా ఉన్నప్పుడు మొదటి భార్య పెద్ద కొడుకు నిత్యం మఠం పనుల్లోనే నిమగ్నం అయ్యి ఉండేవారు. దీనితో.., పీఠాధిపతి పదవికి పెద్ద కుమారుడు అర్హుడని గ్రామస్థులు అతనికి మద్దతు తెలుపుతున్నారు. కానీ.., వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మాత్రం రెండో కుమారుడి పేరు వీలునామాలో రాశారు. తల్లికి అనారోగ్యం చేసినప్పుడు కిడ్నీ దానం చేశాడు కాబట్టి.., వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి చిన్న కొడుక్కి ఈ అధికారం కట్టబెట్టాలి అనుకున్నారు. కానీ.., అతనికి ఊరి ప్రజల మద్దతు లేదు. మరోవైపు, వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని రెండో భార్య వాదిస్తోంది. దీంతో.., అందరి అభిప్రాయాలు తెలుసుకున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ ప్రాథమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు. మరి రానున్న కాలంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా భక్తులు పవిత్ర క్షేత్రంగా భావించే బ్రహ్మం గారి మఠం విషయంలో ఇలాంటి పోటీ నెలకొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.