అసోం రూరల్- సాధారనంగా మనం ఎక్కువగా రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. వేగంగా వెళ్లే వాహనాలు ఒకదానికొకటి ఢీ కోనీ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కానీ గాల్లో విమానాలు, రైళ్లు ఢీ కొనడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాగే నదుల్లో, సముద్రాల్లో పడవలు ఢీ కొనడం కూడా అరుదనే చెప్పాలి. కానీ ఒక్కోసారి ఇలా నదుల్లో, సముద్రాల్లో జరిగే ప్రమాదాలు మాత్రం చాలా బీభత్సంగా ఉంటాయి.
బుధవారం అసోంలో ఘోరమైన పడవ ప్రమాదం జరిగంది. బ్రహ్మపుత్ర నదిలో ఈ విషాదం చోటు చేసుకుంది. బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాలా మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో రెండు పడవల్లో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రెండు పడవలు ఢీ కొనగానే ఓ పడవ నీట మునిగిపోయంది.
బ్రహ్మపుత్ర నదిలో ప్రభుత్వ బోట్ మజూలీ అనే ప్రాంతం నుంచి ప్రయాణికులతో నిమాతీ ఘాట్ వైపు వస్తుండగా, మరో పడవ వ్యతిరేక దిశలో వచ్చింది. మరి ఏంజరిగిందో తెలియదు కాని, ఓ పడవ మరో పడవను ఢీకొంది. దీంతో ప్రభుత్వ బోట్ పాక్షికంగా ద్వంసమైంది. భయాందోళనకు గురైన ప్రయాణికులు కొందరు తమ ప్రాణాలను రక్షించుకోడానికి నీటిలో దూకారు.
మరి కొందరు నీటిలో పడి పోయారు. కొందరికి ఈత వచ్చినా నది ప్రవాహానికి గల్లంతయ్యారు. దీంతో ఎంత మంది సురక్షితంగా బయటపడ్డారన్నది ఇంకా అధికారికంగా తెలియలేదు. ఈ ప్రమాద ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రయాణికులను కాపాడడానికి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి బిమల్ బోరాహ్కు సూచించారు. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.