ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గురువారం 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో మీరట్లోని హస్తినాపూర్ అసెంబ్లీ స్థానానికి మిస్ బికినీ 2018 అయిన అర్చన గౌతమ్ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎంపిక చేశారు. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన కొద్దిసేపటికే కొందరు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు. గ్లామర్ ఫీల్డ్లో ఉండటంతో.. ఆమె ఫొటోలు పోస్టు చేసి ఇలాంటి వారికి టికెట్ ఇస్తారా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’తో అర్చన బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. తమిళం, హిందీ మరియు తెలుగు సినిమాలలో కూడా ఆమె నటించారు. సథియా సాథ్ నిభానా, కుబూల్ హై, సీఐడీ లాంటి టీవీ సీరియల్స్లో కూడా అర్చన నటించారు. గతేడాది నవంబర్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీరట్లో జన్మించిన అర్చన వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. మోడల్, నటి అర్చన గౌతమ్ వృత్తిరీత్యా బికినీ గర్ల్గా కూడా చాలా ఫేమస్. ఇదిలా ఉంటే.. ఉత్తర్ప్రదేశ్లో ‘బికినీ గర్ల్’ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. మోడల్, నటి అర్చనా గౌతమ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని భాజపా తప్పుబట్టింది. అయితే, కాషాయ నేతల ఆరోపణలను హస్తం పార్టీ ఖండించింది. కాంగ్రెస్కు అభ్యర్థులు లేనందున.. చౌకబారు ప్రచారాల కోసం ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఉత్తర్ప్రదేశ్ భాజపా నేత రాకేశ్ త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఆమెకు టికెట్ ఇవ్వడం వెనుక ప్రజాసేవ వంటి భావన లేదని చెప్పారు.
ఇది చదవండి : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
ఇక అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన హస్తినాపూర్ లో అర్చన వంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా దెబ్బతిన్నదని… ఆ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏదీ ఆశించలేమని ఎద్దేవా చేశారు. అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసే అర్చనకు టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని చక్రపాణి ధ్వజమెత్తారు. అయితే, ఇవేవీ ఆ పార్టీకి మేలు చేయవని అన్నారు.
భాజపా వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న కళాకారిణికి అవకాశం ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నించింది. బాజాపా లో నటులు, కళాకారులు ఉన్నారని, అందులో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఏది ఏమైనా ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో అర్చన టికెట్ వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.