పోలీసులు అత్యుత్సాహం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్లి తోరణాలు ఆరని ఇంట్లో పోలీసులు ప్రవేశించి.. కొత్త కోడలు బెడ్రూంలో సోదాలు జరిపారు. జరిగిన తంతు చూసి షాక్ కు గురై స్పృహ కోల్పోయింది సదరు మహిళ. ఆ వివరాలు..
బిహార్ మహిళల విన్నపం మేరకు ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ రాష్ట్రంలో 2016, ఏప్రిల్ నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్రమ మద్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో వైశాలి పోలీసులు హజీపూర్ సిటీలో ఉన్న షీలా దేవి ఇంటికి వచ్చారు.
ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. ఐదు రోజుల క్రితమే షీలా దేవి కుమారుడికి వివాహం అయ్యింది. ఆమె కోడలు పూజా కుమారి బెడ్రూంలో ఉంది. ఇక పోలీసులు డైరెక్ట్గా అక్కడికే వెళ్లి.. ఆమె సూట్కేసులు, బీరువా గాలించారు. అసలు దేని గురించి వెతుకుతున్నారు అని ప్రశ్నిస్తే.. నోరుమూసుకుని ఉండండి అంటూ కఠినంగా మాట్లాడారు.
ఆ తర్వాత మద్యం బాటిళ్లు ఏం దొరకకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. జరిగిన తంతు చూసి షీలా దేవి షాక్ తో స్పృహ కోల్పోయారు. ఈ సందర్భంగా పూజా కుమారి మాట్లాడుతూ.. ‘‘పోలీసుల చర్యల వల్ల మా అత్తగారు అనారోగ్యం పాలయ్యారు.. మా పరువు పోయింది. అసలు మా ఇంట్లో ఎవరికి మద్యం సేవించే అలవాటు లేదు’’ అని వాపోయింది.