భర్త నుంచి విడిపోయి మరోసారి వివామం చేసుకోవాలనుకునే ఆడవారే అతడి టార్గెట్. మ్యాట్రిమోనీల్లో అలాంటి వారి వివరాలు సేకరించి.. నెమ్మదిగా వారితో మాట కలుపుతాడు. పరిచయం పెంచుకుని.. పెళ్లి ప్రస్తావన తెస్తాడు. వారికి ఏదో ఉపకారం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. పెళ్లి చేసుకుంటాడు. ఇప్పటికి ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిని వివాహం చేసుకున్నాడు. ఆరో భార్య ఫిర్యాదుతో ఈ నిత్య పెళ్లి కొడుకు వేషాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
కర్ణాటక, మల్లేశ్వరం ప్రాంతానికి చెందిన సయ్యద్ విడాకులు తీసుకున్న మహిళల్ని టార్గెట్ గా చేసుకుని.. వారిని నమ్మించి వివాహం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 2018 మ్యాట్రీమోనీలో రెండో వివాహం కోసం ప్రకటన ఇచ్చిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. సయ్యద్ కు ఆమె ఆరో భార్య. ఈ మోసం గురించి ఆమెకు కొన్ని రోజుల క్రితం తెలిసింది. సయ్యద్ మరో వివాహానికి ప్రయత్నించడం ఆమె కంటపడింది. దాంతో అతడి గురించి పూర్తిగా ఆరా తీయగా.. సయ్యద్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై సదరు మహిళ బెంగళూరు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. మ్యాట్రిమోనీల్లో ప్రకటన ఇస్తున్న మహిళలను తన భర్త ఎలా మోసం చేస్తున్నాడో ఫిర్యాదులో పేర్కొంది. ఆమె కంప్లైంట్ మేరకు పోలీసులు సయ్యద్ పై కేసు నమోదు చేశారు.