ఐపీఎల్ జట్లలో వరుస కరోనా కేసులు నమోదవడంతో.. ఐపీఎల్ 2021 సీజన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే అత్యధిక ఆదాయం బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచే వస్తోంది. ఐదేళ్లకాలానికి స్టార్ స్పోర్ట్స్ రూ.16,347 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,369.40 కోట్లని బీసీసీఐకి చెల్లించాల్సి ఉండగా.. ప్రతి మ్యాచ్కీ రూ.54.50 కోట్లని ఇస్తోంది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్లో కేవలం 29 మ్యాచ్లు మాత్రమే ఇప్పటి వరకూ జరిగి ఉండటంతో.. స్టార్ స్పోర్ట్స్ నుంచి రూ.1,580 కోట్లు మాత్రమే బీసీసీఐకి లభిస్తాయి. ఇక మిగిలిన రూ.1,690 కోట్లని బీసీసీఐ వదులుకునే పరిస్థితి నెలకొంది.
ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ స్ఫాన్సర్గా ఉన్న వివో ఈ ఏడాదికి రూ.440 కోట్లని చెల్లించాల్సి ఉండగా.. సీజన్లో సగం మ్యాచ్లు మాత్రమే జరగడంతో.. రూ.220 కోట్లని బీసీసీఐకి ఇవ్వనుంది. ఇక మిగిలిన స్ఫాన్సర్లు డ్రీమ్ 11, అప్స్టాక్స్, టాటా మోటర్స్, అన్అకాడమీ, సీరెడ్ తదితర స్ఫాన్సర్లు తలా రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. టోర్నీ వాయిదాతో ఈ స్ఫాన్సర్లు అందరూ సగం మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా.. ఐపీఎల్ 2021 సీజన్ని నిరవధికంగా వాయిదా చేయడం ద్వారా బీసీసీఐ సుమారు రూ.2,200 కోట్లు నష్టపోనుందని భోగట్టా.