నిజామాబాద్- నేటి సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలపై జరగుతున్న అఘాయిత్యాల నేపధ్యంలో ఆందోళన నెలకొంది.
తాజాగా నిజామాబాద్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని బాలికపై ఓ దుర్మార్గుడు కామవాంఛలతో చెలరేగిపోయాడు. ఆమెను బెదిరించి, భయపెట్టి లొంగదీసుకుని శారీరక సుఖం పొందాడు. ఏం జరిగిందో తెలియని వయసులో గర్భం దాల్చిన ఆ మైనర్ బాలికను చూసి కన్నవాళ్లు కుమిలిపోతున్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన నిజామాబాద్ పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది. బోదన్ రోడ్ లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మాజిద్ అభం శుభం తెలియని పన్నెండేళ్ల బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆ బాలికను బెదిరించి, మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా బెదిరించి ఆమెపై చాలా సార్లు కామవాంఛలు తీర్చుకున్నాడు.
ఈ నేపధ్యంలో ఆ బాలిక గర్భం దాల్చింది. కూతురు ఆర్నెల్ల గర్భవతని తెలియడంతో కన్నవాళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కనుపాపపై అంతటి ఘోరం జరిగిందని తెలిసి కుమిలిపోతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కూతురి జీవితాన్ని నాశనం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన నిజామాబాద్ లో కలకలం రేపుతోంది.