ఓమిక్రాన్ వేరియెంట్ భయం రోజురోజుకి టెక్ దిగ్గజ కంపెనీలలో పెరుగుతోంది. ఈ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని దిగ్గజ కంపెనీలు నిర్ణయించుకుంటున్నాయి.
ఇదివరకే గూగుల్ ‘ఆఫీస్ రిటర్న్’ నిర్ణయాన్ని వాయిదా వేయగా.. ఇప్పుడు అదేబాటలో ఆపిల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇదివరకు 2022 ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని తెలిపిన ఆపిల్.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. అంతేగాక ప్రతీ ఉద్యోగికి 1,000 డాలర్ల(76 వేల రూ. పైనే) వర్క్ఫ్రమ్ హోం బోనస్ ఇవ్వనున్నట్లు ఆపిల్ వెల్లడించింది.