అమరావతి- దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులోను ఒమిక్రాన్ వేరియంట్ కూడా విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల నేధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈమేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు కరోనా నిబంధలను ఖచ్చితంగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో కరోనా ఆంక్షలను అందరు పాటించాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రాయాణించే ప్రయాణీకులు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి 50 రూపాయల జరిమానా విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు తమిళనాడు నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో రాత్రివేళలో కర్ఫ్యూ విధించింది. ఈ నెల 6 నుంచి 10 వరకు తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. దీంతో బస్ సర్వీసుల విషయంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పలు సూచనలు చేశారు.
తమిళనాడు వైపు వెళ్లే బస్సుల్లో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ చేయాలని, సిబ్బంది రెండు సార్లు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, తమిళనాడులో కర్ఫ్యూ అమల్లోకి వచ్చే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఏపీ బోర్డర్ కు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.