ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచంలో ప్రతి రోజూ అవయవాల సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా వరకు కిడ్నీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కిడ్నీ బాధితులకు అవసరానికి సరైన కిడ్నీ దొరకక చాలామంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే వైద్యరంగం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులోకి వచ్చింది.
అవయావాల మార్పిడిలో వైద్య రంగం ఎంతో పురోభివృద్ది చెందింది. అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవయవాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మనిషికి అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దానికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
జంతువుల అవయవాలను మనిషికి అమర్చే అంశంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు బ్రెయిన్ డెడ్ అయిన ఓ రోగికి పంది కిడ్నీని అమర్చి అధ్భుతం సృష్టించారు.
ప్రపంచంలో ఫస్ట్ టైమ్ పంది కిడ్నీని మనిషికి అమర్చారు. రోగి కుటుంబసభ్యుల అంగీకారంతోనే ఈ ఆపరేషన్ జరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మూడు రోజుల పాటు బ్రెయిన్ డెడ్ అయిన రోగి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగా పనిచేసింది. రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని వైద్యనిపుణులు చెప్పారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనే దిశగా జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే పందుల అవయవాలపై దృష్టి పెట్టారు సైంటిస్టులు.