కాకినాడ- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ పై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవ్వడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండదని, ప్రాణానికేమి ప్రమాదం లేదని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఇక శుక్రవారం రాత్రి సాయి ధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మొట్ట మొదట అల్లు అర్జున్ కే తెలిసిందట. ప్రమాదం జరగ్గానే అక్కడ ఉన్న స్థానికులు సాయి ధరమ్ తేజ్ను మొదట హైటెక్ సిటీ సమీపంలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న స్నేహితుల ద్వారా అల్లు అర్జున్ కు సమాచారం అందింది. ఆ సమయంలో బన్నీ కాకినాడలో పుష్ప షూటింగ్లో ఉన్నాడు.
సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మామయ్య చిరంజీవి, అత్త సురేఖలకు ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అల్లు అర్జున్. మెడికవర్ ఆస్పత్రిలో ఉన్న స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు సాయిధరమ్ ఆరోగ్యం గురించి అల్లు అర్జున్ తెలుసుకుంటూ ఉన్నారు. మెడికవర్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించే సమయంలోను అల్లు అర్జున్ స్నేహితులతో టచ్ లో ఉండి, సమాచారాన్ని తెలుసుకున్నారు.
ఇక అపోలో ఆస్పత్రి రాంచరణ్ సతీమణి ఉపాసనదే కావడంతో అక్కడికి వెళ్లాక అల్లు అర్జున్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక అపోలో ఆస్పత్రికి మెగా కుటుంబ సభ్యులంతా వెళ్లి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై పూర్తి కేర్ తీసుకున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై వస్తున్న వదంతులను అల్లు అల్జున్ ఖండించారు. అదంతా దుష్ప్రచారమని అన్నారు.