నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి.. బోయపాటి మాస్ పల్స్ తోడవడం, ఈ కాంబోకి థమన్ టాప్ లేచిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో అఖండ మూవీ మాస్ జాతరలా తయారైంది. ఇక ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించడం విశేషం. బాలయ్య నటించిన ఈ అఘోరా పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న అఖండ సినిమాలో నటించిన నటీనటులే కాకుండా.. ఒక ఫైట్ సీన్లో కనిపించే గిత్తలు కూడా ఫేమస్ అవుతున్నాయి.
ఆ గిత్తలు ఏ జాతివి, ఎవరివి, ఎక్కడివీ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగవెతికేస్తున్నారు. ఆ గిత్తలు చౌటుప్ప ల్ మండలం లక్కారం గ్రామానికి చెందివి. ఆ గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టాడు. వీటి ధర లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో సొంత పని నిమిత్తం శ్రీనివాస్ గతేడాది రామోజీ ఫిలింసిటీకి వెళ్లాడు. అక్కడ షూటింగ్ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ వచ్చింది.
దాంతో తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించాడు. కోడెల నైపుణ్యం నచ్చిన నిర్వాహకులు షూటింగ్కు ఆహ్వానించారు. ఆ మేరకు ఏడాది క్రితం రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్లో పాల్గొన్నాయి. చిత్రంలోని ప్రారంభ సన్నివేశంతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి. మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సినిమాకే వన్నె తెచ్చాయి. ప్రముఖ హీరోతో కలిసి ప్రధానమైన సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ తెలిపాడు.