హైదరాబాద్- సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఈజీ మని ప్రకటనల నమ్మవద్దని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించినా లాభం లేకుండా పోతోంది. ఆన్ లైన్ మోసాలు మితిమీరిపోవడంతో చాలా మంది వారి చేతిలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంది. మణికొండలో నివసించే 36 ఏళ్ల మహిళ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. బిట్ కాయిన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన చూసిందామె. ఇంకేముంది ఆ యాప్లో రిజిస్టర్ అయ్యి ముందు5వేల రూపాయలు డిపాజిట్ చేయగా, 2,500 లాభం వచ్చింది.
ఆ తర్వాత మరో 5వేలకు మళ్లీ2,500 లాభం వచ్చింది. ఈ సారి 50 వేల రూపాయలను పెట్టుబడి పెట్టగా 25వేల రూపాయలు లాభం వచ్చింది. వెంటనే వచ్చిన లభాన్ని విత్ డ్రా చేసుకుంది ఆ మహిళ. ఇలా పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తుండటంతో ఆ యాప్ పై ఆమెకు నమ్మకం పెరిగింది. ఈ సారి ఏకంగా 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందామె. అందుకు లాభం 2 కోట్ల 50 లక్షల లాభం వచ్చినట్లుగా యాప్లో చూపించింది.
ఎగిరి గంతేసిన ఆ మహిళ ఆ డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఎంతకీ డబ్బు మాత్రం విత్ డ్రా కాలేదు. యాప్ కస్టమర్ కేర్కు కాల్ చేసి విషయం చెప్పగా, మరో 10 లక్షలు రీఛార్జ్ చేస్తే మొత్తం లాభం 5 కోట్లు వస్తుందని, ఆ తరువాత విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. దీంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరో 10 లక్షలు యాప్ లో రీఛార్జ్ చేసింది. ఆ తరువాత వేరే వేరే కారణాలు చెప్పి ఛార్జీల పేరిట మరో 5.50 లక్షలు యాప్ ద్వార రాబట్టుకున్నారు.
ఆ తరువాత మొత్తం 5 కోట్ల రూపాయలకు 15 శాతం పన్ను కడితేనే డబ్బులు డ్రా చేసుకోవచ్చని యాప్ కస్టమర్ కేర్ ప్రతినిధులు చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే సైబరాబాద్ కమిషనరేట్కు వెళ్లి విషయం చెప్పింది. ఆమె చెప్పినదంతా విని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.