కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకినవారిలో చాలామంది ప్రజలు కోలుకుంటున్నా, ఇతరత్రా సమస్యలు ఉన్న కొద్ది మంది చనిపోతున్నారు. అయితే, కనీస రహదారి సౌకర్యం లేని ఓ మారుమూల గిరిజన గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా అంటే ఆ గిరిజనులకు ఎలాంటి భయాందోళనలు లేవు. అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా కనీస రహదారి సౌకర్యం లేని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో గతేడాది కాలంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మొదటి వేవ్ వైరస్ చాలా వరకు గ్రామాలకు దరి చేరలేదు. కానీ సెకండ్ వేవ్లో మాత్రం పల్లెలు, గ్రామాలు, పట్ణణాలు అని తేడా లేకుండా కేసులు నమోదు అయ్యాయి. మారుమూల గ్రామాలను సైతం వణికించింది. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో నాలుగు వలస గొత్తి కోయ గ్రామాలున్నాయి. అయితే అక్కడ కరోనా కేసులు నమోదు కాలేదు. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో ఐతయ్య గుంపులో 41, మడకం మల్లయ్య గుంపులో 11, మనుబోతులగూడెం గ్రామంలో 20 కుటుంబాలు, సంతోష్గుంపులో 28, పొడియం నాగేశ్వరరావు గుంపులో 20, వేములూరు గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి.
మనుబోతులగూడెం గ్రామపంచాయతీ ప్రజలు కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేశారు. శుభకార్యాలకు, ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. ఇతర గ్రామాలకు వెళ్లకపోవడం, శుభకార్యాలకు వెళ్లకపోవడం, జనావాసాల ప్రాంతాలకు వెళ్లకపోవడంతో వారి దరి దాపుల్లోకి కరోనా చేరలేదు. ఎక్కువ శాతం ప్రజలు గ్రామానికే పరిమితమయ్యారు. అంతేకాకుండా ఇక్కడ ఉండే గిరిజనులు, ఆదివాసీలు, గొత్తి కోయలు అటవీ ఉత్పత్తులు సేకరించి అడవిలో సహజంగా లభించిన ఆహార పదార్థాలు తిన్నారు. దీంతో వారిలో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంది. వారు తీసుకున్న ఆహారం, వారి ఆహారపు అలవాట్లు వారి జాగ్రత్తలే వారిని కరోనా నుంచి కాపాడాయి. నేటికి కూడా వైరస్ వారికి రాకుండా చేశాయి.