సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరో గొంతుక మూగబోయింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ గాయని సంధ్య ముఖర్జీ నిన్న కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. దక్షిణ కోల్కతాలోని తన ఇంట్లోని స్నానాల గదిలో కాలు జారి పడిన ఆమె గత నెల 27న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు.
ఇటీవల ఆమెకు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. అవయవాలు సరిగా పనిచేయకపోవడమే కాక ఎముక విరిగినట్టు కూడా వైద్యులు గుర్తించారు. మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో గుండె పోటుతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎస్డీ బర్మన్, నౌషాద్, సలీల్ చౌధురి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన సంధ్య.. బంగ్ బిభూషణ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లోకి ఎక్కారు. ఆమె కన్నుమూతపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు సంతాపం ప్రకటించారు.