తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే.. మరో వైపు తమిళనాడులో విమర్శలు కూడా అదేస్థాయిలో వెల్లువడుతున్నాయి. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా చూసి అనగారిన వర్గాలపై పోలీసులు చూపించిన కర్కశత్వాన్ని చూసి చాలా మంది నిద్రలేని రాత్రులు గడిపామని వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అన్ని వర్గాల వైపు నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటున్న ‘జై భీమ్’చిత్ర యూనిట్ కి వన్నియార్ సంఘం షాక్ ఇచ్చింది.
ఈ చిత్రంలోని కొన్ని సంఘటనలు తమ వర్గాన్ని కించపరిచేలా, పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటూ వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిత్ర యూనిట్కు లీగల్ నోటీసు జారీ చేశారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. జై భీం సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంగం లీగల్ నోటీసు జారీ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కలిగించేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ మూవీలో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నప్పటికీ, రాజకన్నును హింసించే పోలీసు పాత్రను ఉద్దేశపూర్వకంగా వన్నియార్ కులానికి చెందినదిగా చిత్రీకరించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంతి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. జై భీమ్లోని ప్రధాన అంశం రిటైర్డ్ జస్టిస్ చంద్రు వాదించిన కేసులో అధికారులపై న్యాయ పోరాటం ఎలా సాగింది. న్యాయం కోసం ఆయన ఎలా సహాయపడ్డారు అన్న అంశాలను మాత్రమే చూపించేందుకు ప్రయత్నించాము. అని సూర్య వివరణ ఇచ్చారు.