ప్రపంచంలో భాషాభేదం లేకుండా ప్రజాదరణ పొందేవి పాటలు. పాట అనేది ఎక్కడ ఏ భాషలో పుట్టినా.. దానికి తగిన సంగీతం తోడైతే ప్రపంచదేశాలను చుట్టేస్తుంటుంది. సాధారణంగా అందరి దృష్టిలో సినిమా పాటలకు ఓ స్థానం ఉంటుంది. సినిమా పాటలకన్నా ప్రత్యేక స్థానం జానపదాలు, పల్లె గేయాలకు ఉంటుందని చెప్పాలి. పల్లె పాటలు అనేవి అదృష్టం ఉన్నవారికి మాత్రమే దొరికే ఆణిముత్యాల లాంటివి. జనజీవనంలో వస్తున్న మార్పులు, నాగరికత దృష్ట్యా జానపదాలు అనేవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జానపదాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
తెలంగాణలో ఇప్పటికీ జానపద గేయాలకు మంచి ఆదరణ ఉంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో జానపదాలు అనేవి అంతరించిపోయాయి. ఎక్కడో కొన్ని ప్రాంతాలు, మారుమూల గ్రామాలలోనే వినిపిస్తున్నాయి. దురదృష్టం కొద్దీ వాటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. పల్లె పాటలను బ్రతికించాలని, జనాల్లోకి ఆ పాటలను తీసుకెళ్లాలనే ఆలోచన ఎవరూ చేయట్లేదు. ఇక రీసెంట్ గా మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాలో ‘జారుమిఠాయి’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటలో ఎవరున్నారు? అనే విషయం పక్కన పెడితే.. ఆ పాట ద్వారా టాలెంట్ ఉన్న ఇద్దరు మహిళలు భారతమ్మ, నాగరాజమ్మ వెలుగులోకి వచ్చారు.
ఈ మధ్యకాలంలో కొత్తగా ఎవరి టాలెంట్ బయటికి వచ్చినా ట్రోల్ చేయడం అనేది దారుణంగా అయిపోయింది. జనాలకు తెలిసిన వారు, తెలియనివారు ఎవరూ కెమెరా ముందుకు వచ్చినా ట్రోల్స్ చేసేస్తున్నారు. ఎందుకోగానీ.. జారు మిఠాయి సాంగ్ వెనకున్న భారతమ్మ, నాగరాజమ్మలను కూడా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారతమ్మ, నాగరాజమ్మ ఇద్దరూ కూడా ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. వాళ్ళు పల్లెల్లో పాడుకునే జానపదాలను, వాళ్ళంతట వారే క్రియేట్ చేసిన పాటలు అవి. ఆ పాటలను రెగ్యులర్ గా ఊర్లో పాడుకున్నట్లుగానే స్టేజ్ పై పాడారు.
భారతమ్మ, నాగరాజమ్మ పాడిన విధానం బాగుందనే మంచు ఫ్యామిలీ వాళ్ళను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా స్టేజ్ పై పాడటం మొదటిసారి అయినా వాళ్లకు వచ్చినట్లుగా పాడారు. అంతమాత్రాన జారు మిఠాయి సాంగ్ బాలేదని, ప్రొఫెషనల్ సింగర్స్ లా పాడలేదని కామెంట్స్ చేసే అవసరం లేదు. నిజానికి పల్లె పాటలను ఎవ్వరూ ధైర్యంగా బయటికి తీసుకురావట్లేదు. తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి వాళ్ళను హేళన చేయడం, ట్రోల్ చేయడం ఓ ప్యాషన్ అయిపోయింది. ట్రోల్ చేసేంత అవసరం ఏముంది.. సినిమాలో అయితే ప్రొఫెషనల్ సింగర్స్ పాడతారు, మంచి మ్యూజిక్ సెట్ చేస్తారు. వీళ్ళు ఒరిజినల్ పాటను అలాగే ప్రెజెంట్ చేయడం తప్పా? ఏపీలో పల్లెపాట మూలాలు ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు లాంటి కొన్ని ప్రాంతాలలోనే బ్రతికున్నాయి.
ముఖ్యంగా ట్రోలర్స్ అయినా గమనించాలి. మనం ఎవరిని ట్రోల్ చేయాలి? ఏ విషయంలో ట్రోల్ చేయాలి? ఎంతవరకు లిమిట్స్ లో ఆగిపోవాలి? అనే అంశాలను గుర్తుంచుకోవాలి. ఒక జానపద గేయాన్ని సినిమా వరకు తీసుకురావడం అంటే.. చిన్న విషయం కాదు. ఎన్నో పాటలు పక్కన పెడితేగానీ ఈ జారు మిఠాయి అనేది బయటికి రాలేదు. భారతమ్మ రాసుకున్న ‘జారు మిఠాయి’ లిరిక్స్, నాగరాజమ్మ రాసుకున్న ‘నువ్వు వస్తావని’ లిరిక్స్ వేరు. ఈ రెండింటినీ కలిపి రాసిన రైటర్ గణేష్, మరో మ్యూజిషియన్ కిషన్ కవాడియా.. ఇదే పాటను సినిమా కోసం పాడిన నిర్మల రాథోడ్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్.. ఇంతమంది కష్టాన్ని ట్రోల్స్ తో తూకం వేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం.
పల్లె పాటలను బయటికి తీసుకొచ్చి.. వాళ్ళ పాటను బతికించుకోవాలని అనుకున్న భారతమ్మ, నాగరాజమ్మలకు మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం బాధాకరం. ఇలాంటి వారిని గౌరవించుకోవాలి. గౌరవించాల్సిన వాళ్లకు గౌరవం ఇవ్వాలి.. అనేది మీమర్స్, ట్రోలర్స్ గుర్తుంచుకోవాలి. ఇలాంటి కల్మషం లేని మనుషులను ట్రోల్ చేస్తున్నందుకు సిగ్గుపడాలి. ఒక కొత్త టాలెంట్ బయటికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వేలో జనాల్లోకి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. ట్రోల్ చేసే ఒక్క నిమిషం ముందు ఆలోచించినా.. ఎక్కడో వెంకటగిరి ప్రాంతం నుండి వచ్చిన మారుమూల జానపదం ‘జారు మిఠాయి’ సాంగ్ వెనకున్న భారతమ్మ, నాగరాజమ్మలు ఇంత నెగటివిటీని ఫేస్ చేసేవారు కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జారు మిఠాయి అనే జానపద పాటను, ఆ పాటను పుట్టించిన భారతమ్మ, నాగరాజమ్మలను నెటిజన్స్, ట్రోలర్స్ గుర్తించకపోయినా.. మంచు ఫ్యామిలీ గుర్తించి, వాళ్లకు అవకాశం ఇచ్చినందుకు మంచు ఫ్యామిలీని అభినందించాలి. ఈ జారు మిఠాయి అనే పాటకు సినిమాటిక్ టచ్ ఇచ్చి.. అనూప్ రూబెన్స్ వేరే సింగర్ తో సినిమా కోసం పాడించాడు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ జారు మిఠాయి సాంగ్ పాడిన ఆ భారతమ్మ, నాగరాజమ్మలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ అనేవి మంచి విషయాలకు, టాలెంట్ ఉన్న కొత్తవాళ్లకు బూస్ట్ అవ్వాలి. ఏపీలో జానపద కళాకారులను, పల్లె పాటలకు ఆదరణ ఏ విధంగా ఉందో గమనించారా?
ఎక్కడో మారుమూల గ్రామాలలో పుట్టే జానపద పాటలు.. ఒరిజినల్ గానే అందంగా ఉంటాయి. ఆ పాటలు ప్రొఫెషనల్ గా లేకపోయినా.. ఆ పాట పుట్టిన ప్రాంతాన్ని ప్రపంచమంతటికీ పరిచయం చేస్తుంది. అసలే మరుగున పడిపోతున్న పల్లె గేయాలను, పల్లెలో పాటలు పాడుకునే కళాకారులను ఇలా ఎప్పుడో ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. కానీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల ప్రతిభ ఉన్నవారు బయటికి రావడానికి భయపడేలా.. అమ్మో ట్రోల్స్ చేస్తారని వెనకడుగు వేసేలా చేస్తున్నారు ట్రోలర్స్. ఎవరిని ట్రోల్ చేయాలో.. జనాలకు ఉపయోగపడే పాయింట్ కోసం ట్రోల్స్ క్రియేట్ చేస్తే మంచిదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.