చిత్రపరిశ్రమలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తోంది. మోస్ట్ బ్యాచ్ లర్స్ లిస్టులో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. రణ్బీర్ కపూర్-అలియా భట్ల పెళ్లి నుంచి నయనతార-విఘ్నేష్ శివన్, నాగశౌర్య, హన్సిక, మంజిమా మోహన్ లాంటి పలువురు స్టార్లు గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు.
కాగా, తాజాగా ఓ తెలుగు యువ దర్శకుడు పెళ్లి పీటలెక్కాడు. ‘తొలిప్రేమ’ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు హీరో నితిన్ తన భార్యతో కలసి వచ్చాడు. అలాగే హీరోయిన్ కీర్తిసురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వెంకీ అట్లూరి దంపతులతో కలసి దిగిన ఫొటోను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు వెంకీ అట్లూరికి అభినందనలు’ అంటూ ఈ పోస్టుకు నితిన్ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
ఇక, ‘స్నేహగీతం’ చిత్రంతో హీరోగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్తో ‘తొలిప్రేమ’ మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రమే సూపర్ హిట్ అవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం అక్కినేని వారసుడు అఖిల్తో ‘మిస్టర్ మజ్ను’, నితిన్తో ‘రంగ్ దే’ సినిమాలు రూపొందించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద యావరేజీగా నిలిచాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో ‘సార్’ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఫిల్మ్.. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ఆడియెన్స్ ముందుకు రానుంది.