ప్రముఖ నటి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఓ ఫౌండేషన్ పేరుతో నటి విజయలక్ష్మి డబ్బు వసూలు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. వేరే గీత రచయిత స్థాపించిన ఫౌండేషన్ పేరును ఉపయోగించుకుని నటి విజయలక్ష్మి సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయంపై గీత రచయిత కోర్టుకెక్కగా.. ఆధారాలు ఉంటే నటిపై కేసు నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. వెంటనే తిరుమంగళం పోలీసులు విచారణ జరిపి నటి విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం ఇరుబాక్కం వెంకటేశ్ నగర్ లో నివసిస్తున్న ప్రముఖ గేయ రచయిత స్నేహన్ ఓ ఫౌండేషన్ ని స్థాపించారు. 2015లో తన పేరుతో వచ్చేలా.. స్నేహం ఫౌండేషన్ ని స్థాపించారు. స్నేహన ఆ ట్రస్టు పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ ట్రస్టు పేరుని ఉపయోగించుకుని నటి విజయలక్ష్మి డబ్బు వసూలు చేస్తున్నట్లు స్నేహన్ దృష్టికి వచ్చినట్లు తెలిపాడు. స్నేహన్, నటి జై లక్ష్మీభాయి ఆగస్టు 5న చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయలక్ష్మి స్నేహన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ అతనిపై ఫిర్యాదు చేసింది.
ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులతో ఆగిపోతే కుదరదు అనుకున్నాడో ఏమో.. వెంటనే స్నేహన్ చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు. తన ట్రస్టు పేరుతో విజయలక్ష్మి వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించాడు. అంతేకాకుండా తగిన విచారణ జరిపి ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. గేయ రచయిత స్నేహన్ వాదన విన్న హైకోర్టు తగిన విచారణ జరిపి.. ఆధారాలు ఉంటే నటి విజయలక్ష్మిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుమంగళం పోలీసులు నటి విజయలక్ష్మిపై ఐపీసీ సెక్షన్ 420, 465 కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు కూడా జారీ చేశారు. ఇంద్దరూ సినిమా వాళ్లు కావడంతో స్థానికంగా ఈ కేసు కలకలం రేపుతోంది.