మనిషి జీవితంలో.. ఒడిదుడుకులు చాలా సహజం. జీవితంలో అత్యున్నత శిఖరాలను చవి చూస్తాం.. అంతులేని కష్టాలను అనుభవిస్తాం. అయితే కష్టసుఖాలు ఏవైనా సరే.. ఎల్లకాలం ఉండవు. నీటి ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా ఈ పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. సామాన్యుల విషయంలో ఇలాంటి సంఘటనలు వస్తే.. పెద్దగా పట్టించుకోం.. కానీ సెలబ్రిటీల జీవితాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. అది వార్త అవుతుంది. ఇక నటీనటుల జీవితాల్లో ఒడిదుడుకులు చాలా సహజం. కొన్నాళ్ల పాటు సూపర్ స్టార్లుగా వెలుగొందుతారు.. కొన్నాళ్ల పాటు అపజయాలు చవి చూస్తారు. కానీ ఆ తర్వాత పూర్వ వైభవం పొందిన వారు ఎందరో ఉన్నారు. అదిగో మనం అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు.. అసలు మిత్రులు ఎవరో.. నటించేవారు ఎవరో మనకు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఇలా సిగ్గులేకుండా నటించే వాళ్లు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొనే లీన్ పిరియడ్ గురించి, చిరంజీవిపై వస్తోన్న కామెంట్స్పై స్పందించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలోని ప్రతీ టాప్ హీరో లీన్ పీరియడ్ చూసిన వారే. అలాంటి సమయంలో చాలా మంది ముఖం చాటేస్తారు.. మరి కొందరు.. చూడనట్లు నటిస్తారు. ఇక లీన్ పీరియడ్ అయిపోగానే.. ఆ సెలబ్రిటీలు మళ్లీ షైన్ అయితే.. అన్నాళ్లు ముఖం తిప్పుకుని వెళ్లిన వాళ్లే.. మళ్లీ సిగ్గులేకుండా వారి దగ్గరకి వస్తారు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో అవసరం కోసం వచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారు.. అలాంటి వాళ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది’’ అన్నారు.
‘‘సోషల్ మీడియాలో చిరంజీవిగారు, బాలకృష్ణగారి గురించి చాలా మంది ఏవేవో మాట్లాడుతుంటారు. కొందరైతే చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయింది.. ప్రస్తుతం ఆయన పక్కన మరో హీరో ఉండాల్సిందేనని ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో చిరంజీవిగారే 1 నుంచి 10. ఎవరో వచ్చి.. ఆయనకు జాకీ పెట్టి లేపాల్సిన పని లేదు. ఆయన ఫాలోయింగ్, రెవెన్యూ ఆయనకున్నాయి. ఇండస్ట్రీలో ఇంతకు ముందు రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణగారు, శోభన్బాబుగారు వంటి హీరోలు కూడా లీన్ పీరియడ్ చూశారు. కానీ మళ్లీ కొన్నాళ్లకు వాళ్లు స్ట్రైక్ బ్యాక్ అయ్యారు. ఎవరి స్థానం వాళ్లకే ఉంటుంది. ఇండస్ట్రీలో అవసరానికి వచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ ఒకేలా ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలా అవసరానికి వచ్చేవాళ్ల గురించి మాట్లాడుకుంటే.. మనల్ని మనమే తక్కువ చేసుకున్న వాళ్లం అవుతాం అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.