డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి సూపర్ సక్సెస్ చిత్రాలను అందించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం నుంచి ‘స్వాతిముత్యం’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ నటిస్తోంది. లక్ష్మణ్ కె. కృష్ణ స్వాతిముత్యంతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాడు. దసరా కానుగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా బృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగానే విలేకరులతో మూవీ టీమ్ ముచ్చటించింది. ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాలు ఉండగా నాగవంశీ ఏ ధైర్యంతో సినిమా విడుదల చేస్తున్నారంటూ ప్రశ్నించారు. “కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అలాంటిదేం లేదండి. కరోనా తర్వాత ప్రతివారం కనీసం రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. అంతేకాకుండా దసరా సీజన్ కావడంతో రెండు సినిమాలున్నా పర్లేదని రిస్క్ తీసుకుంటున్నాం.” అంటూ నాగవంశీ తెలిపాడు. చిరంజీవి మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు.. మీరెలా ఫీల్ అయ్యారని అడగ్గా.. “ అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. చిన్న సినిమాలను ఎప్పుడూ ఆదరించాలనే చెబుతుంటారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.” అంటూ సూర్యదేవర నాగవంశీ చెప్పుకొచ్చాడు. సినిమా మాత్రం అవార్డు విన్నింగ్ మూవీ కాకపోయినా.. కడుపుబ్బా నవ్వించే సినిమా అవుతుంది. కాంట్రవర్సీ కాన్సెప్ట్ కి ఫన్ యాడ్ చేసి తీసుకొస్తున్నాం. కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందంటూ హామీ ఇచ్చారు.