స్టార్ హీరోయిన్ అయినంత మాత్రం వాళ్లకు అన్ని తెలియాలని ఏం లేదు. మనలానే కొన్నిసార్లు వాళ్లు కూడా కొందరు వ్యక్తుల మాటలు నమ్మి మోసపోతుంటారు. తీరా అంతా అయిపోయాక బాధపడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆమెనే తనకు జరిగిన మోసం గురించి బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. రూ.200 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు నోరా ఫతేహి పేర్లు ఈడీ తన ఛార్జీషీట్ లో చేర్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్, నోరా వాదనలను కోర్టు రికార్డు చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా, ప్రత్యేక గీతాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న వారిలో జాక్వెలిన్ ఒకరు. కొన్నాళ్ల ముందు మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ అరెస్టు చేసిన ఈడీ.. అతడితో సంబంధం ఉందనే ఆరోపణలతో జాక్వెలిన్, నోరా ఫతేహిలను కూడా విచారించింది. తాజాగా వాంగ్మూలం సమర్పించేందుకు వచ్చిన జాక్వెలిన్.. సుఖేశ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. అతడి వల్ల తన లైఫ్ నాశనమైపోయిందని ఆరోపించింది. తన ఎమోషన్స్ తో ఆడుకున్నాడని, తన కెరీర్ ని నాశనం చేశాడని పాటియాలా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈమె వెల్లడించింది.
‘సుఖేశ్ తాను సన్ టీవీ ఓనర్ ని అని, తమిళనాడు మాజీ సీఎం జయలలిత బంధువని చెప్పాడు. నాకు పెద్ద ఫ్యాన్ అని, నాతో సౌత్ లో సినిమా చేస్తానని చెప్పాడు. అలా రోజులో నాతో ఎక్కువసార్లు వీడియోకాల్స్ మాట్లాడేవాడు. రోజూ ఉదయం షూటింగ్ కు వెళ్లే ముందు, షూటింగ్ లో ఉన్నప్పుడు, రాత్రి షూటింగ్ నుంచి ఇంటికొచ్చేశాక ఫోన్లు చేసేవాడు. జైల్లో ఉన్నాడని, అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నాడని నాకు చెప్పలేదు. అతడు చివరిసారిగా 2021 ఆగస్టు 8 కాల్ చేశాడు. తర్వాత అతడు అరెస్ట్ అయినట్లు తెలిసింది. సుఖేశ్ గురించి పింకీకి పూర్తి వివరాలు తెలుసు. ఆమె నన్ను మోసం చేయాలనే ఉద్దేశంతోనే అతడిని నాకు పరిచయం చేసింది. అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు’ అని జాక్వెలిన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి జాక్వెలిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.