Karachi: ఈ మధ్యకాలంలో సినిమా టైటిల్స్ ని, హీరో హీరోయిన్ క్యారెక్టర్ల పేర్లను షాపింగ్ మాల్స్ కి, హోటల్స్, రెస్టారెంట్లకు పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని పేర్లు వినియోగదారులను అట్రాక్ట్ చేయవచ్చు. మరికొన్ని విమర్శలకు దారి తీయవచ్చు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పోస్టర్ ని రెస్టారెంట్ కోసం వాడుకుంటూ బాగానే బిజినెస్ లో డబ్బు చేసుకుంటున్నాడు ఓ వ్యాపారి.
వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి సినిమా.. గుర్తుండే ఉంటుంది. అందులో అలియా ఓ వేశ్య నుంచి వేశ్యా కేంద్రం నిర్వాహకురాలిగా ఎదిగే పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే.. ఆ సినిమాలో విటులను అలియా చేతితో సైగ చేస్తూ స్వాగతం పలికే సీన్ ఉంటుంది. సరిగ్గా ఇదే సీన్ ను పోస్టర్ గా ముద్రించి తన రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు ఓ పాకిస్థానీ.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ పాకిస్థానీ రెస్టారెంట్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చాలా మంది ఆ రెస్టారెంట్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అలియా పోస్టర్ ను వాడుకుంటూ రెస్టారెంట్ కు వచ్చే మగవారికి 25% డిస్కౌంట్లు ప్రకటించడమే వివాదానికి కారణమైంది. ‘మెన్స్ మండే’ పేరుతో కరాచీలోని ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది.
మగవారికి బిల్లులో 25 శాతం డిస్కౌంట్ అంటూ.. ’‘ఆజా నా రాజా – దేనికోసం ఎదురు చూస్తున్నావు?. ఆజావో.. మెన్స్ మండే రోజు 25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకో’’ అనే ట్యాగ్ లైన్ పెట్టేశాడు. నీవు పెట్టిన సీన్, ఇస్తున్న ఆఫర్ స్త్రీ ద్వేషాన్ని సూచిస్తుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరి పురుషులకు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చే ఈ పాకిస్థానీ రెస్టారెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.