టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతూనే ఉంది. శర్వానంద్, సిద్ధార్థ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘RX 100’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అజయ్ మూవీ కావడంతో మహాసముద్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఓ అపురూప ప్రేమ కథ అంటోంది యూనిట్. ఈ సినిమాలో అదితిరావు హైదర్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రం, ‘హే రంభ ‘ పాటలకు మంచి హిట్ టాక్ వచ్చింది. సిద్దార్థకు కెరీర్లో గ్యాప్ వచ్చినా ‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమాతో మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇక శర్వానంద్ కూడా భారీ హిట్ కొట్టి చాలా రోజులైంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘మహాసముద్రం’ జులై నెలలో షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. అక్టోబర్ 14న థియేటర్లలో మహాసముద్రం ప్రయాణం మొదలవుతుందని వెల్లడించారు. మాస్ గెటప్లో శర్వానంద్, సిద్ధార్ధ్ ఇద్దరు ఒకరికి ఒకరు గన్ను గురిపెట్టుకుని ఉన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. హీరోల మధ్యలో ఒక కథానాయిక చిత్రం మాత్రమే ఉంది. కథలో ఒకవేళ ఒకే హీరోయిన్ కోసం మన హీరోలు తలపడబోతున్నారా అన్న అనుమానాన్ని కలిగించేలా ఉంది. అసలు కథ తెలియాలి అంటే అక్బోబరు 14 దాకా ఆగాల్సిందే మరి.