తెలుగు ఇండస్ట్రీలోకి ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే తన సత్తా చాటింది. రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ అందేరి కోసివ్తో వివాహం జరిగిన తర్వాత కొంత కాలం విరాం తీసుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. స్టార్ హీరోయిన్ గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రియా శరన్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తోంది.
తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గమనం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా శ్రియ హైదరాబాదులోని మల్లికార్జున థియేటర్ కు విచ్చేసింది. కూకట్ పల్లిలో ఉన్న థియేటర్ వరకు ఓ ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆటోలో ఓ స్టార్ హీరోయిన్ ప్రయాణించి సినిమా చూడటం అనేది నిజంగా ఆమె సింప్లిసిటీకి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక తమ అభిమాన హీరోయిన్ ఓ ఆటోలో ప్రయాణిస్తుందన్న విషయం తెలుసుకొని అభిమానులు భారీగా తరలి వచ్చారు.
కొత్త దర్శకురాలు సుజనా రావు ‘గమనం’ చిత్రాన్ని తెరకెక్కించింది. కలి ప్రొడక్షన్స్, క్రియా ఫిల్మ్ కార్ప్ బ్యానర్లపై రమేశ్ కరుటూరి, వెంకీ పుష్పదపు, వీఎస్ జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రియాతో పాటు ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్, సుహాస్, రవిప్రకాశ్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం.