బిగ్ బాస్ రియాలిటీ షో.. ప్రేక్షకులకు కొత్తవాళ్లను పాతవాళ్లను పరిచయం చేస్తుంది. కానీ అందులో పాల్గొన్న వారిలో కొందరు మాత్రమే మంచి స్నేహితులు అవుతారు, మరికొందరు విభేదాలతో బయటికి వస్తుంటారు. బిగ్ బాస్ 5వ సీజన్ లో అనూహ్యంగా బయటికి వచ్చిన యాంకర్ రవి.. కంటెస్టెంట్స్ తో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే.. షో అనంతరం కూడా తోటి హౌజ్ మేట్స్ ని కలుస్తూ మాట్లాడుతున్నాడు రవి.
ముఖ్యంగా యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి ఎంత స్నేహంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ హౌజ్ లో రవితో పాటు షన్ను, సిరిలపై కూడా ఎన్నో విమర్శలు వినిపించాయి. కానీ షో ముగిసాక అవన్నీ జుజుబీ అని రుజువు చేశారు. మొత్తానికి రవి, షణ్ముఖ్, సిరి స్నేహంగా ఉంటున్నారు. గత ఆదివారం రవి ఇంటికి షన్ను వెళ్లాడు. అక్కడ రవి కూతురు వియాతో ఆడుకున్నాడు.
అందరూ కలిసి మంచి పార్టీ కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా రవి ఇంట్లో గడిపిన క్షణాలను తలుచుకుంటూ షన్ను ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ”కృతజ్ఞత పూర్వకమైన పోస్ట్.. నేను రవి అన్నకు ఎన్నో పేర్లు పెట్టాను. కానీ నాకు తిరిగి ప్రేమనే పంచాడు. నువ్వు చేసిన ప్రతీ దానికి, కొత్తగా కొనిచ్చిన హుడికి థ్యాంక్స్. వదిన, క్యూటీ వియాకు థ్యాంక్స్” అంటూ షన్ను పోస్టులో తెలిపాడు.
ఇక షన్ను పోస్ట్ పై రవి భార్య నిత్య స్పందించి.. ‘నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది షన్ను. రవి నిన్ను ఎందుకంత ఇష్టపడతాడో.. లిటిల్ బ్రో అని ఎందుకు పిలిచాడో అర్థమైంది’ అంటూ కామెంట్ చేసింది. దీనిపై రవి కూడా స్పందిస్తూ.. ‘అరేయ్ ఏడిపించేశావ్ రా బాబు.. అన్ని నేమ్స్ ఇచ్చినందుకు సారీ చెప్పు ముందు.. నేను నీకు ఎప్పుడూ ప్రేమనే పంచాను. బీబీలో నువ్వు నాకు దొరకడమనేది గొప్ప విషయం. ఈ ప్రపంచంలోని సంతోషాన్ని కూడా పొందే అర్హత నీకుంది. ఈ అన్న నీకోసం ఎప్పటికీ ఉంటాడు’ అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం రవి – షన్నుల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీరి స్నేహం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.