హీరోగా కన్నా కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. కెరీర్లో ముందుకు సాగుతున్నాడు. తాజాగా వచ్చిన గాడ్ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం సినిమాతో డిసెంబర్ 9న విడుదలయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్.. తన జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలు వివరించారు. మరీ ముఖ్యంగా ఆయనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..
సినిమాలపై తన ఆసక్తి గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సత్యదేవ్. ఇక తాను చిరంజీవికి ఏకలవ్య శిష్యుడిని అని చెప్పుకొచ్చాడు సత్యదేవ్. ఇక సాఫ్టవేర్ ఇంజనీర్ అయిన తాను జాబ్ వదిలేసి సినిమాలవైపు వస్తానంటే.. కుటుంబ సభ్యులు వద్దాన్నా.. తన భార్య మాత్రం.. తనను బాగా ఎంకరేజ్ చేసిందని.. మద్దతుగా నిలబడిందని చెప్పుకొచ్చాడు. ఇక గాడ్ఫాదర్ సినిమా షూటింగ్ సందర్భంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్లి.. 2 గంటలు కూర్చుని.. టిఫిన్ తిని, కాఫీ తాగానని.. చాలా విషయాల గురించి మాట్లాడాను అని.. ఆ రోజు తన జన్మ ధన్యమైంది అని భావించాను అన్నాడు సత్యదేవ్.
ఇక అఫ్గనిస్థాన్లో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఒక చేదు అనుభవం ఎదురయ్యిందని చెప్పుకొచ్చాడు. అఫ్గనిస్తాన్ ఎయిర్ పోర్టులో.. ఈ దేశం ఎందుకు వచ్చారని ప్రశ్నించగా.. సినిమా షూటింగ్ కోసం అని చెప్పాను. దానికి అక్కడ ఉన్న ఆమె.. పోయి పోయి ఈ దేశానికి షూటింగ్ కోసం వచ్చారా.. ఆల్ ది బెస్ట్ అని ఓ చూపు చూసింది అన్నాడు. ఇదిలా ఉంటే.. తనను సూసైడ్ బాంబర్ అనుకుని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం వెల్లడించాడు సత్యదేవ్.
‘‘సాధారణంగా సూసైడ్ బాంబర్స్ ట్రిగర్స్ కాలి దగ్గర ఉంచుకుంటారట. ఈ విషయం నాకు తెలియదు. ఇక ఎయిర్పోర్ట్లో నా పక్కన ఉన్న ఓ వ్యక్తి.. పాస్పోర్ట్ని కాలి దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని తీయటానికి ప్రయత్నిస్తుంటే పోలీసులకు అతడిపై అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. అయితే అతడి పక్కనే ఉన్న నన్ను కూడా అతడితో పాటు వచ్చిన సూసైడ్ బాంబర్ అనుకుని అరెస్ట్ చేశారు’’ అని తెలిపాడు సత్యదేవ్. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.