కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు తెలియాలంటే సెలబ్రిటీ ఉండాలి. సెలబ్రిటీకి కోట్లు ఇచ్చి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తుంటాయి కంపెనీలు. అయితే అటువంటి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు నటించకూడదంటూ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
కంపెనీలు తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీలు, స్టార్ హీరో, హీరోయిన్ల ఇమేజ్ ను వాడుకుంటాయి. ఇందు కోసం ఆయా సెలబ్రిటీలకు కోట్లలో పారితోషికం ఇస్తాయి. ఈ ప్రమోట్ చేసే ఉత్పత్తులను వారి ఫ్యాన్స్ ఎగబడి కొంటారు. సాధారణ ప్రేక్షకులు సైతం మన తెలుగు హీరోయే కదా చెబుతున్నాడు అని చెప్పి కొంటూ ఉంటారు. అయితే కంపెనీలు మంచివైతే పర్లేదు. జనాన్ని నిండా ముంచే కంపెనీలు అయితేనే అసలు సమస్య. ప్రకటనలు చేసే వారికి కూడా బాధ్యత ఉండాలని కొందరు హీరోలు అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటారు. ఈ విషయంలో ముగ్గురు హీరోల గురించి చెప్పుకోవాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి మనకు ఎలాగూ తెలిసిందే.
సాఫ్ట్ డ్రింకులు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని కొన్ని నివేదికలు రావడంతో.. అప్పట్లో రెండు పాపులర్ కూల్ డ్రింకులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాటిని ప్రమోట్ చేయమఅని చెప్పి రియల్ హీరోలు అయ్యారు. అప్పటి నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ యాడ్స్ చేయాల్సి వస్తే ఆచీ తూచీ అడుగులు వేస్తారు. పవన్ కళ్యాణ్ అయితే కోట్లిచ్చినా సరే జనానికి హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతారు. సమాజం పట్ల చిరు, పవన్ లకు ఉన్న బాధ్యత ఇది. ఇలానే మరో రియల్ హీరో సమాజం పట్ల బాధ్యత ఉండాలని గుర్తుచేస్తున్నారు. ఆయనే వీసీ సజ్జనార్. సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సెలబ్రిటీలు చేసే ప్రకటనల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు దయచేసి జనాలు మోసపోయే ప్రకటనలు చేయకండి అంటూ ట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆమ్వే కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాబట్టి ఆయన ప్రమోట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ మంది మీద ఉంటుంది. అయితే అన్ని కంపెనీలు మంచివి ఉండవని.. సెలబ్రిటీల క్రేజ్ ను వాడుకుని.. జనాలను మోసాలు చేస్తాయని సజ్జనార్ అన్నారు. ‘సూపర్ స్టార్ అమితాబ్ మరియు ఇతర సెలబ్రిటీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి ఆమ్వే లాంటి మోసాలు చేసే కంపెనీలకు సహకరించకండి. అవి దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ ను దెబ్బ తీస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వే మీద 2022లో ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించిన ఈడీ ఆమ్వే ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సజ్జనార్ ఇలాంటి బోగస్ కంపెనీలను ప్రమోట్ చేయకూడదంటూ సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ ట్వీట్ పై నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు ప్రకటనలు చేసే ముందు ఆ కంపెనీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023