ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైమ్ లో బాలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుంది రష్మిక. నిజానికి అందరు హీరోయిన్లలానే రష్మిక కూడా బాలీవుడ్ ఛాన్స్ వస్తే సినిమా చేయాలని అనుకుంది. ఆ దిశగా ప్రయత్నించి సక్సెస్ అయింది. మిషన్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నలుగుర్ని అనుకొని, ఫైనల్ గా రష్మికకు ఫిక్స్ అయ్యాడట దర్శకుడు శాంతను. దీనికి అతడు చెప్పే రీజన్ డియర్ కామ్రేడ్ సినిమా. ఆ సినిమాలో రష్మిక లుక్స్, యాక్టింగ్ నచ్చి తన హిందీ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నానని వెల్లడించాడు.
స్పై థ్రిల్లర్ గా వస్తున్న మిషన్ మజ్నులో హీరోయిన్ పాత్రకు అమాయకమైన లుక్స్ ఉండాలి. అదే టైమ్ లో కథ ప్రకారం ఓ దశలో షాకిచ్చే వేరియేషన్ కూడా చూపించాలి. దీనికితోడు గ్లామరస్ గా కూడా ఉండాలి. ఈ లక్షణాలన్నీ డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మికలో తను చూశానని, అందుకే మరో ఆలోచన లేకుండా జూమ్ కాల్ లో రష్మికను సంప్రదించి, ఆమెను తీసుకున్నామని తెలిపాడు. డియర్ కామ్రేడ్ సినిమా సౌత్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎవ్వరికీ ఈ సినిమా కలిసిరాలేదు. కానీ రష్మికకు మాత్రం ఏకంగా బాలీవుడ్ ఆఫర్ అందించింది. రష్మికను అంతా అదృష్టవంతురాలు అనేది ఇందుకే. ఫ్లాప్ సినిమాతో ఏకంగా బాలీవుడ్ ఆఫర్ పట్టేసింది. ఈ క్రమంలో ఈ అందాలభామ బాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ ను అందుకుంది. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే అనుబంధాలు, భావోద్వేగాల కథతో రూపొందే ఈ చిత్రంలో అమితాబ్ కు కూతురిగా రష్మిక నటిస్తుంది. ఇందులో ప్రముఖ నటి నీనా గుప్తా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చి నెలలో మొదలవుతుంది. ఈ చిత్రానికి ‘డెడ్లీ’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.