రానా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రభాస్, మహేష్ బాబు ఎవరో వారికి తెలిదని చెప్పడంతో తాను షాక్ తిన్నానని రానా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్ ను స్టార్ట్ చేసింది ఎవరంటే దర్శక దీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి ది బిగినింగ్ సినిమాతో టాలీవుడ్ స్టాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. ఇక బాహుబలి సిరీస్ ద్వారా విలన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు రానా. ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రానా.
రానా నాయుడు.. విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కు కరన్ అన్షుమాన్ సుపర్ణ్ దర్శకత్వం వహించాడు. మార్చి 10 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే నేషనల్ మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చాడు రానా. ఈ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి బాలీవుడ్ అభిమానులు ఏమనుకుంటున్నారో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..”మనం సినిమాలను భాష పేరుతో వేరు చేసుకుంటున్నాం. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు హిందీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇక నా రెండో మూవీని బాలీవుడ్ లోనే చేశా(ఘాజీ), ఇక భాష పేరుతో సినిమాని వేరేచేసే పరిస్థితులను చెరిపే రోజులు వస్తున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు రానా.
ఇక కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. రానా ఓ సారి బాలీవుడ్ కు వెళ్లినప్పుడు ఓ మిత్రుడికి బాహుబలి సినిమా గురించి చెప్పాడట. ఆ సినిమాలో నేను, హీరో ప్రభాస్ చేస్తున్నాం అని చెప్పగా.. ప్రభాస్ ఎవరు అని అడిగాడట ఆ మిత్రుడు. దానికి అవాక్కైయ్యాడు రానా. ఇక ప్రభాస్ నటించిన కొన్ని సినిమా పేర్లను తన మిత్రుడికి చెప్పి వివరించే ప్రయత్నం చేశాడట రానా. కానీ అతడు ప్రభాస్ నటించిన ఒక్క సినిమా చూల్లేదని, నాకు టాలీవుడ్ లో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి చిన్ను భర్త ఒక్కరే అని చెప్పాడు. చిన్ను అంటే ఎవరో రానాకి కొద్దిసేపు దాక అర్థం కాలేదట. తర్వాత తెలిసింది చిన్ను అంటే నమ్రత శిరోద్కర్ అని. దాంతో నమ్రత భర్తగా మహేశ్ బాబు తెలియడం ఏంటి? అని షాక్ అయ్యాడంట రానా. ఇక అప్పుడు రానా ఓ స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు ఆగు మా టాలీవుడ్ ఆర్మీ అంత మీ బాలీవుడ్ పై దండయాత్ర చేస్తుంది అని రానా అన్నాడు. ప్రస్తుతం ఇదే నిజం అవుతోంది అని రానా ఇటీవల అతడిని కలిసినప్పుడు చెప్పగా సంతోషించాడు ఆ వ్యక్తి. మరి బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్, మహేశ్ బాబు తెలియకపోవడం ఏంటి? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.