సుప్రీం హీరో సాయితేజ్ను నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ను ఆవిష్కరించిన దర్శకుడు దేవ కట్టా, చిత్ర బృందాన్ని పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ అభినందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటైన సినిమా మాధ్యమంలో ప్రభావ వంతమైన సినిమాలు చేయాలని భావించి ప్రారంభం నుంచి అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తోన్న దర్శకుడు దేవకట్టా మరోసారి తన మార్క్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్హిట్ టాక్తో రన్ అవుతోంది.
‘‘ఇప్పటి వరకు సాయితేజ్ చేసిన సినిమాలకు రిపబ్లిక్ సినిమా పూర్తి భిన్నమైనది. నటుడిగా తన కెరీర్లో మరచిపోలేని చిత్రం. అలాగే తనను యాక్టర్గా కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఇది. సమాజంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, న్యాయ వ్యవస్థను మూడు గుర్రాలతో పోల్చి అవి ఎలా ఉండాలి.. ఎలా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేసేలా , నేటి సమాజంలో ఉన్న పరిస్థితులను ఆవిష్కరించేలా రిపబ్లిక్ చిత్రాన్ని దేవకట్టా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలోని ప్రతి పాత్ర మనకు నచ్చేలా తీర్చిదిద్దారు దేవ కట్టాగారు. మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం, సుకుమార్గారి కెమెరా వర్క్ అన్నీ చక్కగా కుదిరాయి. అలాగే ఇంత మంచి టీమ్ను ఓ చోట చేర్చి సినిమాను అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించిన నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు, జీ స్టూడియోస్వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు పవన్కళ్యాణ్, త్రివిక్రమ్.