క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతూ పవన్ కల్యాణ్ వీరాభిమాని భార్గవ్ కన్నుమూశాడు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామానికి చెందిన భార్గవ్ అనే యువకుడు పవన్ కల్యాణ్ కి వీరాభిమాని. పవన్ చిత్రాలు రిలీజ్ అయితే చాలు ఊరంతా సందడి చేస్తూ.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కొనుక్కుని చూసేవాడు. భార్గవ్ ఇటీవల క్యాన్సర్ కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు.
భార్గవ్ తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ని చూడాలని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని పవన్ కళ్యాన్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాన్ ఆ యువకుడి వైద్య ఖర్చులకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆస్పత్రికి బయలుదేరి భార్గవ్కు ధైర్యాన్ని చెప్పి అతడికి వెండి గణపతి విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. తొందరగా కొలుకోమని, అధైర్య పడొద్దని.. నేనున్నానంటూ భరోసా కల్పించారు.
ఆ తరవాత భార్గవ్ కోలుకున్నాడు. అనంతరం ఆస్పత్రి నుండి డిశ్జార్జ్ అయ్యి ఇంటి వద్దే చికిత్స తీసుకున్నాడు. కానీ విధి వక్రించింది.. భార్గవ్ క్యాన్సర్ ని జయించలేకపోయాడు. మళ్లీ అరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఇక ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు భార్గవ్ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.