రోజులు గడుస్తున్నా కొద్దీ వయసు మీద పడటం అనేది సహజమే. ఈ విషయాన్ని ఎంతటి వారైనా అంగీకరించకతప్పదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నవారు చాలాకాలం కనిపించకుండా పోయి ఒక్కసారిగా ముసలితనం మీదపడి కనిపిస్తే.. అభిమానులు షాక్ అవుతుంటారు. తాజాగా సినీ అభిమానులకు అలాంటి షాకే ఇచ్చారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు. ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలపాటు తమ కథలు, డైలాగ్ లతో మెప్పించిన పరుచూరి బ్రదర్స్ లో ఈయన పెద్దవారు. చిన్నవారు పరుచూరి గోపాలకృష్ణ.
ఓవైపు ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాలు రాసేవారు పరుచూరి వెంకటేశ్వరరావు. వీరిద్దరికీ ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి ప్రత్యేకత తీసుకొచ్చారు దివంగత నందమూరి తారక రామారావు గారు. అప్పటినుండి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరూ ‘పరుచూరి బ్రదర్స్’గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. మూడు వందలకు పైగా సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్.. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందించారు.ఇప్పటి సమాజ తీరుకి పురాణ ఇతిహాసాలను జోడించి సంభాషణలు రాయడంలో అగ్రగామి అనిపించుకున్నారు పరుచూరి బ్రదర్స్. పరిశ్రమలో వీరి రచనాశైలికి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇక కేవలం రచన పరంగానే కాకుండా నటనలో కూడా మెప్పించారు. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైన వెంకటేశ్వరరావు వయస్సు 80 ఏళ్లు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ బయటకు రావడం లేదు.
ఇటీవల ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాంజీ.. పరుచూరి వెంకటేశ్వరరావును కలిసి పలకరించి ఆయనతో ఓ ఫోటో దిగారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘గురువు గారు వెంకటేశ్వరరావును చూసి బాధపడ్డాను. కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటిలానే చురుకుగా ఉంది’ అని తెలిపారు. కానీ డైరెక్టర్ షేర్ చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో చూసి చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు. ‘ఏంటి గురువుగారూ ఇలా అయిపోయారు?’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయన ఫోటో వైరల్ అవుతోంది. మరి పరుచూరి బిగ్ బ్రదర్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.