ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులు సీనియర్ నటీ,నటులు మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ప్రముఖ ఒరియా నటి ఝరానా దాస్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి కన్నుమూశారు. కటక్లోని తన స్వగృహంలో 77 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఝరానా దాస్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, ఝరానా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె 1945లో జన్మించారు. 15 ఏళ్లకే సినిమా కెరీర్ను మొదలుపెట్టారు. 1960లో సినిమాల్లోకి వచ్చారు.
శ్రీ జగన్నాథ్, నారీ, అదినామేగా, హిసబ్నికాస్, పూజాఫులా, అమదబాతా, అభినేత్రి, మలజన్హా, హీరా నెల్లా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఝరానా బాల నటిగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా కూడా పనిచేశారు. అంతేకాదు! అదే ఆల్ ఇండియా రేడియాలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్గా కూడా పనిచేశారు. మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి హరేకృష్ణ మహ్తాబ్ మీద ఆమె ఓ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి ఝరానానే దర్శకత్వం వహించారు.
ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె ఉత్తమ నటనకు గానూ స్టేట్ గవర్నమెంట్ అవార్డు సైతం అందుకున్నారు. ఇక, ఝరానా మృతిపై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ రంగస్థలం, సినిమాల్లో ఆమె నటన మరిచిపోలేనిది. ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని పేర్కొన్నారు. ఝరానా మృతిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.