సంక్రాంతి సీజన్ ను బంగార్రాజు సినిమా గట్టిగానే క్యాష్ చేసుకుంది. కింగ్ నాగార్జున, నాగచైతన్య భారీ హిట్టే కొట్టేశారు. అయితే ఇప్పుడు బంగార్రాజు కలెక్షన్లు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్షన్లను న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో కంపేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రెండు సనిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రెండు పద్దతుల్లో ప్రవర్తించింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
డిసెంబర్ 25న విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నా కూడా ఏపీలో మాత్రం నష్టాలు తప్పలేదు. నాని తన రెమ్యునరేషన్ లో కొంత నిర్మాతకు వెనక్కు ఇచ్చేశాడని కూడా చెప్పుకున్నారు. నాని సినిమా సమయంలో ఏపీలో థియేటర్లపై రైడ్లు జరిగాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు టికెట్లు అమ్మని థియేటర్లను సీజ్ కూడా చేశారు. కానీ, సంక్రాంతికి ఆ వాతావరణం కనిపించలేదని.. ఎక్కడా రైడ్లు అనే మాట వినిపించలేదు అంటున్నారు. గతంలో సినిమా టికెట్ల విషయంలో నాని ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని విమర్శించిన విషయం తెలిసిందే.
సంక్రాంతికి అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏపీ మొత్తం బంగార్రాజు సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసిందంటున్నారు. ఓవరాల్ గా పల్లెటూరుల్లోనూ సినిమా టికెట్ రూ.100కు విక్రయించారంటున్నారు. అయితే ఇప్పుడు అదే విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం హీరోని బట్టి, సినిమాని బట్టి వ్యవహరిస్తుందా? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాకి ఉన్న అంకిత భావం బంగార్రాజు సినిమా సమయంలో ఏమైందని అడుగుతున్నారు.
కాకినాడలో పుష్ప సక్సెస్ మీట్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అప్పుడు కొవిడ్ కేసుల సంఖ్య 500కు లోపే ఉంది. సోమవారం ఏపీలో కొవిడ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. కానీ, మంగళవారం రాజమహేంద్రవరంలో బంగార్రాజు సక్సెస్ సంబరాలకు అనుమతి ఇవ్వడమే కాకుండా.. ఏపీ మంత్రులు కూడా హాజరవ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనలను ఎత్తి చూపుతూ పలువురు సినీ అభిమానులు ఏపీ ప్రభుత్వం తీరు.. హీరోని బట్టి మారుతోందని విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.