రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ – ఇలా పూర్తిపేరు చెప్తే చాలామందికి తెలీదు. అదే ఆర్పీపట్నాయక్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తక్కువకాలంలో ఎక్కువ హిట్స్ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరక్టర్ తనకెరీర్లో చేసిన ఓ తప్పు గురించి ఒప్పేసుకున్నారు. స్టార్ హీరో సినిమాకి పాటలు పాడి తప్పుచేశానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆర్పీ. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు! తేజ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా, వచ్చిన నిజం సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. కులశేఖర సింగల్ కార్డ్ లో పాటలు రాశారు. ఇందులో మొత్తం పది పాటలుండగా ఏడు పాటలు ఆర్పీనే పాడారు.
చిత్రం సినిమాతో మొదలైన ఆర్పీ సినీ ప్రయాణం – నువ్వు నేను, జయం, మనసంతా నువ్వు, నీ స్నేహం, సంతోషం లాంటి ఎన్నో మ్యూజికల్ హిట్లు ఆయన ఖాతాల్లో ఉన్నాయి. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్గా కూడా శ్రోతలను మెప్పించారు ఆర్పీ కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న సమయంలో సడన్గా సినిమాలకి మ్యూజిక్ చేయడం ఆపేశారయన. ఆ తరవాత నటుడిగా, దర్శకుడిగా సినిమాలు చేశారు. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమా కావడంతో నిజం సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో సినిమా పరాజయం పాలైంది.
నిజం సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్పీ – ఈ సినిమాలో పాటలు పాడి తప్పు చేశానని, కానీ అప్పటికి ఉన్న పరిస్థితుల్లో తప్పలేదని వెల్లడించారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి తన వాయిస్ సరిపోలేదని ఆర్పీ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తానూ రిగ్రేట్ గా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఈ సినిమా తర్వాత సినిమాల్లో పాటలు పాడడం ఆపేయాలని చాలా మంది చెప్పారని ఆర్పీ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.