తెలుగు చిత్ర పరిశ్రమలో ఈరోజు(నవంబర్ 15)ని చీకటిరోజుగా భావిస్తున్నారు. ఒక సూపర్ స్టార్, స్టార్ ప్రొడ్యూసర్, నిర్మాతల అభిమాన హీరో ఇక లేరనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు.. యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు ఈ వార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహం ప్రముఖుల సందర్శనార్థం నానక్రామ్ గూడలోని కృష్ణ స్వగృహంలో ఉంచారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కృష్ణ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం మధ్యాహ్నం 3 గటంల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎందరో ప్రముఖులు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కృష్ణను కడసారి చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆయనను కడసారి చూసుకుని మోహన్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లోపలికి వస్తూనే.. కృష్ణ సోదరుడిని పట్టుకుని మోహన్ బాబు ఏడ్చేశారు. ఆ తర్వాత కృష్ణ భౌతికకాయాన్ని చూస్తూ సోదరా.. సోదరా అంటూ ఏడుస్తూనే ఉన్నారు. మోహన్బాబుని మహేశ్ బాబు హత్తుకుని ఓదార్చారు. ఒక్క టాలీవుడ్ నుంచే కాకుండా.. ఇండియన్ సినిమాలో స్టార్లుగా ఉన్న ఎందరో కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. కడసారి తమ అభిమాన హీరోని దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు.