ఇటీవల ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయంతో టాలీవుడ్ ఇండస్ట్రీ సంక్షోభంలో పడింది. మెల్లగా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కులా మారిపోయారు. ఇండస్ట్రీలోని సమస్యలను తనవంతుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇదివరకెన్నడూ లేని విధంగా ఏపీలో థియేటర్లలో సోదాలు.. థియేటర్ల సీజ్ విషయంలో సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఏపీ ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పెద్దఎత్తున థియేటర్లలో సోదాలు చేయడంతో పాటు సుమారు 130 థియేటర్లకు నోటీసులు జారీ అయ్యాయని, భారీ ఎత్తున జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు థియేటర్ల యజమానులు సైతం స్వచ్చందంగా తమ థియేటర్లను మూసివేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 20ఏళ్ల క్రితం నాటి టికెట్ రేట్లతో థియేటర్లు రన్ చేయలేమని వాపోతున్నారు.
సంక్రాంతికి భారీబడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచే అవకాశం కల్పిస్తూ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో నేరుగా సీఎం జగన్ తో చర్చిస్తే బెటర్ అని భావిస్తున్నారట మేకర్స్. ఈ విషయంలో ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకోని సీఎం జగన్ తో చర్చించడానికి ఓకే చెప్పారట. ఇప్పటికే సినిమా టిక్కెట్ రేట్స్ సమస్య పై చర్చించేందుకు సీఎంని అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా చిరంజీవితో భేటికి సిద్దంగా ఉన్నారట. తాజా సమాచారం మేరకు.. మెగాస్టార్ మొదటగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ఈ విషయం పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చిరు భేటి జరుగుతుందట. మరో రెండు రోజుల్లో వీరి భేటి జరగనుందట.ఈ భేటీలో ముఖ్యంగా ‘ఆన్ లైన్ టికెటింగ్’ పద్ధతిని స్వాగతించిన చిరు.. సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు పై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని, ఇండస్ట్రీకి మేలు జరిగేవిధంగా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం. ఈ కోల్డ్ వార్ వకీల్ సాబ్ సమయం నుండే నడుస్తుందట. అప్పట్లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే తన సినిమా ఫ్రీగా నడిపిస్తానంటూ పవన్ కళ్యాణ్ సవాల్ చేసిన మాట తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఓవైపు ఒమిక్రాన్ ప్రభావం సినిమాల వసూళ్లపై పడుతుందని భయం నెలకొంది. టికెట్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లే.. ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఏపీ టికెట్ల సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అర్దమవుతుంది. మరి జగన్ తో చిరు భేటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.