తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక రకంగా చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువే. అందుకే మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. అంతేకాదు చిరంజీవి తన అభిమానులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు.. అదే వారసత్వాన్ని మెగా హీరోలు కూడా కొనసాగిస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. విశాఖపట్నానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని వెంకట్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. దానికి స్పందించిన చిరంజీవి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. అయితే తాను ప్రస్తుతం కలవలేని పరిస్థితిలో ఉన్నానని వెంకట్ బాధపడ్డారు. వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేదని చిరంజీవి దృష్టికి తీసుకుని వచ్చారు. ఇక్కడే చిరంజీవి తన మానవత్వాన్ని మరోసారి నిరూపించారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాదు రావడానికి వెంకట్, వెంకట్ భార్య సుజాతకు ఫ్లైట్ టికెట్స్ పంపించారు. వెంకట్ ను హైదరాబాద్ రప్పించారు. వెంకట్ ఆయన భార్య సుజాత చిరంజీవి ఇంట్లో కలిసారు. ఇద్దరితోనూ చిరంజీవి దాదాపు 45 నిమిషాలు గడిపారు. మెడికల్ రిపోర్ట్స్ పై సెకండ్ ఒపినియన్ తీసుకున్న చిరంజీవి.. వెంకట్ ను హైదరాబాద్ లో ఒమేగా ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. తన అభిమానికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్య సిబ్బందికి చిరంజీవి చెప్పారు. అవసరమైతే చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. అభిమానులపై చిరంజీవి చూపించే ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.