గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుకుంటూ పోతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి సైతం ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవలే అనంతపురంలో ఎంతో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ బాలీవుడ్ మీడియాకి గాడ్ ఫాదర్ కు సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆచ్యార్య సినిమా ఫలితం గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆచార్య ఫలితం గురించి చిరంజీవి తొలిసారి స్పందించారు. “ ఆచార్య సినిమా ఫలితం నన్ను ఏమాత్రం బాధించలేదు. సినిమా హిట్ అయితే ఆనందపడటం, ఫ్లాప్ అయితే బాధపడిపోవడం లాంటివి కెరీర్ ప్రారంభంలో చేశాను. నా కెరీర్లోని మొదటి 15 ఏళ్లలోనే చాలా ఎదుర్కొన్నాను. అప్పటికే శారీరకంగా, మానసికంగా అన్నింటిని ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్చుకున్నాను. అయితే నటుడిగా పరిణతి చెందాక.. ఏ సినిమా ఫలితమూ నన్ను అంతగా బాధించలేదు. అలాగే విజయాలు కూడా నా తలకెక్కలేదు. ఆచార్య పరాజయం నన్ను అసలు బాధించలేదు. మనం ఎప్పుడూ మన పనిలో బెస్ట్ ఇస్తాం. దర్శకుడు చెప్పిందే నేను చేశాను. కాకపోతే చరణ్, నేను కలిసి చేసిన మొదటి సినిమా హిట్ కాలేదనే చిన్న విచారం ఉంది. ఇంకోసారి మేమిద్దరం కలిసి చేయాలంటే అంత ఉత్సాహం రాకపోవచ్చు” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాటలను వెల్లడించారు.
ఇంక గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. మోహన్ లాల్ ‘లూసీఫర్’ సినిమాకి రీమేక్గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కూడా గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ అయితే ఈ సినిమా కోసం అసలు పారితోషకం కూడా తీసుకోలేదని కేవలం రామ్ చరణ్, మెగాస్టార్ మీదున్న అభిమానంతోనే సినిమాకి ఓకే చెప్పినట్లు చిరంజీవి తెలియజేశారు. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇంక అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.