ఒకప్పుడు ఎవరి మీదైనా కోపం ఉంటే.. తిట్టడం, కొట్టడం లాంటివి చేసేవారు. కానీ సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో.. మనిషిని నేరుగా తిట్టకుండా.. టెక్నాలజీని ఉపయోగించి ట్రోల్ చేస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్రోలింగ్ కష్టాలు తప్పట్లేదు. పలువురు హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. అలాంటి వారిలో మంచు విష్ణు ఒకరు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోని విష్ణు.. తాను హీరోగా చేసిన ‘జిన్నా’ ప్రమోషన్ లో భాగంగా ఈ మధ్య ఓ మీటింగ్ పెట్టారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు పలు వ్యాఖ్యలు చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తాజాగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో మీటింగ్ లో విష్ణు తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడారు. తనపై, తన కుటుంబ సభ్యులపైనా చాలా ట్రోలింగ్ జరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఓ ఐటీ కంపెనీలో 21 మంది ఉద్యోగులు.. తన కుటుంబాన్ని ట్రోలింగ్ చేసేందుకే పనిచేస్తున్నారని, ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో పోలీసుల దగ్గరకు వెళ్తానని మంచు విష్ణు చెప్పారు. ఆ రోజు చెప్పినట్లు ఇప్పుడు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. టాలీవుడ్ కి చెందిన ఓ హీరో ఆఫీస్ నుంచి తనపై ట్రోల్ చేయిస్తున్నారని, తన కుటుంబపై పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
18 యూట్యూబ్ ఛానెల్స్ పైనా మా అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కేసు పెట్టారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ తనపై ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు. సాధారణంగా తాను ట్రోల్స్ లాంటి వాటిని పట్టించుకోనని, జవాబుదారీతనం కోసం ఈ కేసులు పెడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తొలుత దసరా కానుకగా అంటే అక్టోబరు 5న మంచు విష్ణు ‘జిన్నా’ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తేదీని కాస్త అక్టోబరు 21కి మార్చారు. ముందు అనుకున్న తేదీన ట్రైలర్ విడుదల చేస్తామని విష్ణునే స్వయంగా స్పష్టం చేశారు. మరి ట్రోల్ చేసిన వారిపై హీరో విష్ణు ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.