తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా నడుస్తుంది. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన అడివి శేష్.. ఎవరు, క్షణం, మేజర్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం హిట్ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అడివి శేష్. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. అందుకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ తో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో హిట్ 2 చిత్రంతో మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు అడివి శేష్.
హిట్ 2 చిత్రం సక్సెస్ కావడంతో అడివి శేష్ పై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం హిట్ 2 విజయాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రెట్ చేసుకుంటున్నాడు అడివి శేష్. ఈ సందర్భంగా ట్విట్టర్ లో నెటిజన్లతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీకు మహేష్ బాబు తో ఎంతో చనువు ఉంది.. ఆయనతో కలిసి మంచి థ్రిల్లర్ మూవీ చేయొచ్చు కదా అని అడిగాడు.
‘ఈ రోజు ఉదయం మహేష్ బాబు తో చాలా సేపు మాట్లాడాను.. నా విషయంలో ఆయన ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే నాకు కన్నీళ్లు ఆగలేదు.. అంత దుఖఃంలో ఉన్నా కూడా ఆయన ఎదుటివారిని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు.. ఒక బ్రదర్ గా ఎప్పటికీ మీకు తోడుగా ఉంటానని మాటిచ్చాను..’ అని అన్నారు. హిట్ మూవీ చూపించడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా అన్నారు. ఇటీవల మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.