గత కొన్ని రోజులుగా ‘మా’ఎన్నికల రగడ ఏ రేంజ్ లో సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరిగింది. ఈ క్రమంలో ఇరువురి మద్య మాటల యుద్దం జరిగింది. మొత్తానికి గత ఆదివారం ఎన్నికలు ముగిశాయి.. మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సైతం పక్షపాతం చూపించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈసీ మెంబర్ల బాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడంటూ ఈటీవీ ప్రభాకర్ ఆరోపణలు చేశాడు. మంచు ప్యానెల్ సభ్యుడిలా పని చేశాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ వీటన్నింటిని కొట్టి పడేశారు మంచు విష్ణు మరియు ప్యానెల్ మెంబర్స్.
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ‘మా’ కొత్త కార్యవర్గం కొలువు దీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ పలు సంచలన వ్యాఖ్యల చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తరువాత అంతటి లెజెంట్ ఒక్క మోహన్ బాబు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే షాక్ అయినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ పోతున్న కృష్ణ మోహన్ గంభీరంగా మాట్లాడారు.
మా అసోసియేషన్ను పెట్టి 28 ఏళ్లు అవుతున్నాయి. పద్నాలుగు మంది ప్రెసిడెంట్లు వచ్చారు. అందులో పది మంది ప్రెసిడెంట్లు నా ఆధ్వర్యంలోనే ఎన్నికయ్యారు. ఈ సారి మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఆయన నటనలోనే కాదు.. అన్ని విషయాల్లో క్రమశిక్షణగా ఉంటారని.. అదే వారసత్వం పిల్లలకు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తరువాత అంతటి లెజెండ్ మోహన్ బాబు అని ప్రశంసలు కురిపించాడు.