మనసున్న మారాజు, అందరివాడుగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. మరణించేవరకు ఆయన అదే విధంగా వ్యవహరించారు. ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు.. ఆదివారం మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సోమవారం కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే పుట్టిన ప్రతి వారు మరణిస్తారు. కానీ చాలామంది తాము మృతి చెందే సమయానికి బాగా డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించాలి.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని భావిస్తారు. కానీ కృష్టంరాజు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. సుమారు 16 ఏళ్ల క్రితమే తన మృత్యువు గురించి మాట్లాడుతూ.. చనిపోయే రోజు తాను ఎలా ఉండాలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దీని గురించి కృష్టంరాజు నాటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘‘ఓ సారి నేను, నాగార్జున ఫెర్టిలైజర్స్ కేవీకే రాజు పిచ్చపాటి మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో మామధ్య చావు గురించి చర్చకు వచ్చింది. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలివే.. ‘‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు, కీడు చేయలేదని గుండెల మీద చేయి వేసుకుని.. ప్రశాంతంగా, నిర్మలంగా ఆకాశం వంక చూస్తూ.. కన్నుమూయాలిజ’’ ఎప్పటికి ఇదే నా కోరిక అన్నాను’’ అంటూ కృష్టంరాజు చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విన్న అభిమానులు.. ఎంత గొప్ప వ్యక్తిత్తం సార్ మీది.. మీరు బతికినంత కాలం అలానే జీవించారు.. మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ మాటలు అంటున్నారు.
ఇక కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందగా.. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చేవెళ్లలోని మోయినాబాద్ దగ్గర ఉన్న కనకమామిడి ఫామ్హౌస్లో కృష్ణం రాజు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కృష్ణంరాజు మృతి చెందిన వార్త తెలియగానే.. ఆయనను కడసారి చూసుకునేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అలానే సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి కృష్ణంరాజు మృతదేహానికి నివాళులర్పించారు. మరి మృత్యువుపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.