తెలుగు చిత్ర పరిశ్రమలో 1970-80 కాలానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ సమయంలో ఎన్నో కుటుంబా కథా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ జాబితాలోనిదే కృష్ణ-విజయనిర్మల నటించిన పండంటి కాపురం చిత్రం. 1972 జూలై 21న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని హీరో కృష్ణ సమర్పణలో.. జయప్రద పిక్చర్స్ పై జి హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించగా.. లక్ష్మీదీపక్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీనికంటే ముందు లక్ష్మీదీపక్-కృష్ణ కాంబినేషన్లో మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించినప్పటకి.. మహిళా ప్రేక్షకులు ఆదరణ ఆశించినంత మేర లభించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి చక్కని కుటుంబా కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రేమలో విఫలమయిన మహిళ పడే బాధ ఎలా ఉంటుంది.. ఆ కోపంతో ఆమె తీసుకునే నిర్ణయాలు పచ్చగా సాగుతున్న సంసారంలో ఎలాంటి కలతలు రేపాయి అనే కాన్సెప్ట్తో వచ్చిన చిత్రం పండంటి కాపురం. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. వీరి కుటుంబంపై పగ సాధించే మహిళ రాణి మాలినీ దేవి పాత్రలో జమున నటించారు. ఈ పాత్రకు తొలుత భానుమతిని అనుకున్నారు. కానీ ఆమెకు అప్పటికే కృష్ణ హీరోగా నటిస్తున్న అంతా మన మంచికే చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తియ్యాకే దీనిలో చేస్తాను అని చెప్పారు. దాంతో రాణి మాలినీ దేవి పాత్రకు జమునను తీసుకున్నారు. ఈ పాత్రలో జమున జీవించేశారు. సినిమా విడుదలైన తర్వాత ఈ క్యారెక్టర్లో ఆమెను తప్ప వేరే ఎవరని ఊహించుకోలేము.
ఇక ఈ సినిమా ద్వారానే నటి జయసుధ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆఖర్లో చనిపోయే చిన్న పిల్లాడి పాత్రలో నటించిన కుర్రాడు.. మరేవరో కాదు.. సీనియర్ నటుడు వీకే నరేష్. ఇక ఈ సినిమాకు ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు. సినిమాలోని పాటలన్ని సూపర్హిట్. మరీ ముఖ్యంగా బాబు వినరా.. అన్నాతమ్ముల కథ ఒకటి.. జనాల మదిలో నిలిచిపోయింది. 25 కేంద్రాల్లో ఈ చిత్రం రిలీజ్ కాగా.. 3 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.