ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు తెగ భయపడిపోతున్నారు. గత రెండేళ్లుగా కరోనా రక్కసి కాటుతో పలువురు సెలబ్రెటీలు కన్నుమూశారు. మరికొంత మంది ప్రమాదాలు.. అనారోగ్యంతో చనిపోతే.. కొంత మంది మాత్రం ఆత్మహత్య చేసుకొని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కన్నీరు మిగులుస్తున్నారు.
తాజాగా ప్రముఖ మలయాళ సీరియల్ నటుడు రమేశ్ వలీయశాల ఆత్మహత్య చేసుకున్నారు. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం ( సెప్టెంబర్ 11 ) ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణం వార్తతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. మాలీవుడ్ లో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్ బిజీగా ఉండే ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత కొద్దిరోజులుగా కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రమంతటా లాక్డౌన్ వాతావరణం నడుస్తోంది. షూటింగ్స్ కూడా స్వచ్ఛందంగా నిలిపివేశారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే రమేశ్ వలీయాల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్న విషయం తెలియరాలేదు. పోలీసులు ఆయన మృతిపై అన్నాచ్యురల్ డెత్గా పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.