సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు అలముకుంటున్నాయి. నటి జమున, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, యువ నటుడు తారకరత్న మరణాలను మర్చిపోక ముందే.. మరో యువ దర్శకుడు కన్ను మూశారు.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వదలడం లేదు. ఒక్కొక్కరుగా మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. సీనియర్ యాక్టర్ల దగ్గర నుండి ఎంతో భవిష్యత్తు ఉంటున్న సినీతారల వరకు హఠాత్తుగా మరణిస్తున్నారు. సీనియర్ నటి జమున, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, యువ నటుడు తారకతర్న, అటు తమిళ కమెడియన్ మయిల్ స్వామి మరణాలతో ఇండస్ట్రీ విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. వీరి మరణాలు మర్చిపోకముందే.. మరో యువ దర్శకుడు కన్ను మూశాడు.
కేరళ సినీ పరిశ్రమకు చెందిన యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు కేవలం 31 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను కేరళలోని ఎర్నాకుళంలో అలువాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. జోసెఫ్ మృతితో మలయాళ చిత్ర సీమలో విషాదం అలుముకుంది. జోసెఫ్ తెరకెక్కిస్తున్న తొలి సినిమా ‘నాన్సీ రాణి’ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలోనే ఆయన మరణించారు. నాన్సీ రాణిలో అహనా కృష్ణ, ధ్రువన్, అజు వర్గీస్, లాల్ నటించారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సమయంలో జోసెఫ్ చనిపోవడంతో ఈ చిత్రం బృందం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి ఈ చిత్ర బృందం సంతాపం వ్యక్తం చేసింది. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో విడుదలైన‘ ఐ యామ్ క్యూరియస్ ’ అనే చిత్రం ద్వారా జోసెఫ్ బాలనటుడిగా మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, బాలీవుడ్ చిత్రాలలో అసోసియేట్ డైరెక్టర్గా పని చేశారు. ఆయనకు భార్య నైనా మను జేమ్స్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు నిర్వహించారు.