మనిషి జన్మకు నిజమైన సార్థకత ఎప్పుడు లభిస్తుంది అంటే.. ఈ లోకం విడిచి వెళ్లిన తర్వాత కూడా ప్రజలు వారిని మర్చిపోలేకపోతున్నారు.. నిత్యం తలుచుకుంటున్నారు అంటే ఆ జన్మ గొప్పది. చిన్న వయసులోనే కన్నుమూసినా సరే.. ఉన్నంతకాలం.. ప్రజలు తనను పదికాలాల పాటు గుర్తుంచుకునేంత గొప్పగా జీవించాడు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్. ఆయన మృతి చెంది ఏడాది పూర్తయ్యింది.. అయిన సరే ప్రజలు మాత్రం ఆయనను మరవడం లేదు. వి మిస్ యూ అప్పు అంటూ నేటికి కూడా తల్చుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చింది. కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటక రత్న పురస్కారంతో ఆయనను గౌరవించుకుంది. తాజా నిర్ణయంతో పవర్ స్టార్ కీర్తిని.. ఆకాశం అంచుకు తీసుకెళ్లింది. ఏకంగా ఓ శాటిలైట్కు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టేందుకు నిర్ణయించుకుంది కర్ణాటక ప్రభుత్వం. పునీత్ అందించిన సేవలకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కుతుంది.
స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇస్రో దేశీయంగా రూపొందించిన 75 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ ఉపగ్రహాలన్నింటిని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ తయారు చేయనున్న శాటిలైట్కు పునీత్ రాజ్కుమార్ పేరు పెట్టనున్నారు. తొలుత ఈ ఉపగ్రహానికి KGS3Satగా నిర్ణయించారు. కానీ తాజాగా దానికి పునీత్ పేరు పెట్టి.. శాటిలైట్ పునీత్గా మార్చారు. దీని తయారీ కోసం కర్ణాటకలోని అనేక ప్రాంతాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అనేక మోడళ్లు పంపారు. వాటిలో ఉత్తమమైన వాటిని పంపిన 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు…వారికి శిక్షణనిచ్చి ‘శాటిలైట్ పునీత్’ తయారీకి పరిశోధనలను ప్రారంభించారు.
శాటిలైట్ పునీత్ కోసం మొత్తం… కోటి 90 లక్షల రూపాయల ఖర్చు అవుతోంది. ఇక కిలోన్నర బరువుండే ‘శాటిలైట్ పునీత్’ పూర్తి కాగానే దాన్ని ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ కు తరలిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నవంబర్ 15-డిసెంబర్ 31 మధ్యలో ఈ శాటిలైట్ పునీత్ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా 50కిలోల బరువు, 50-60 కోట్ల ఖర్చు పెడితే కానీ పూర్తికానీ ఈ శాటిలైట్ను.. స్వదేశీ టెక్నాలజీ వినియోగించటం ద్వారా కేవలం కోటి 90 లక్షల రూపాయల ఖర్చులో కిలోన్నర బరువులోనే పూర్తి చేయనున్నారు.
విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు, గైడ్ చేసేందుకు కర్ణాటక వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు ముందుకు వస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా.. పునీత్ రాజ్ కుమార్ ఖ్యాతి అంతరిక్షానికి చేరుతుంది.. అప్పు చేసిన సేవలకు ఇది సరైన గౌరవం అని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.